హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): మన ఊరు.. మన బడి పథకం అమల్లో భాగంగా 26,065 పాఠశాలల కోసం పిలిచిన గ్రీన్ చాక్ బోర్డుల కొనుగోళ్ల టెండర్ను రీకాల్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇదే పథకంలో భాగంగా డ్యూయల్ డెస్లకు రూ.360 కోట్లు, ఫర్నిచర్కు రూ.195 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.164 కోట్ల విలువైన గ్రీన్ చాక్ బోర్డుల టెండర్ నంబర్ 45ను సవాల్ చేస్తూ కేంద్రీయ భండార్, వైట్ మార్ కంపెనీ సంయుక్తంగా వేసిన రిట్ పిటిషన్పై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవ్కుమార్ జోక్యం చేసుకుని గ్రీన్ చాక్ బోర్డుల టెండర్ను కూడా రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసి రిట్లపై విచారణ ముగిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఇదే పథకంలో పెయింటింగ్ టెండర్ను సవాలు చేసిన రిట్ పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది.