హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దుచేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల వల్ల శానిటేషన్కు ఇబ్బంది లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, అధికారుల సెలవులు రద్దు చేస్తున్నామని, సెలవులో ఉన్నవారు వెంటనే డ్యూటీలో జాయిన్ కావాలని వెల్లడించారు. కంట్రోల్ రూంలు 24 గంటలు పనిచేస్తుండాలని, మున్సిపాలిటీల్లో నియమించిన ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాలని, శిథిల భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని, అలాంటి వాటిని గుర్తించి కూల్చి వేయాలని, ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్తు స్తంభాలు, వాటర్ పైప్లైన్లు దెబ్బతింటే వెంటనే తొలగించి కొత్త వాటిని వేయాలని, అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.