వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువను ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా భూముల విలువ తక్కువగా ఉన్నచోట్ల 50 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం పెంచారు.
గతంలో ఏడాదికి ఒకసారి గతంలో ప్రభుత్వాలు ప్రతి ఏడాది చార్జీల పెంపు లేదా భూముల విలువల పెంపును చేపట్టేవి. పట్టణ ప్రాంతాల్లో ఏటా విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది విడిచి ఏడాది ధరల సవరణ కొనసాగేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా విధానానికి స్వస్తి పలికింది. ఎనిమిదేండ్ల తరువాత ఇప్పుడే తొలిసారి పల్లెలు, పట్టణాల్లో ఒకేసారి భూముల విలువల సవరణతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను హేతుబద్ధీకరించింది.
అపార్ట్మెంట్లు చదరపు అడుగు రూ.800 ఉన్నచోట రూ.1000 కి పెంచింది. తక్కువగా ఉన్నచోట 20 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం రేట్లను ప్రభుత్వం పెంచింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 16 (నమస్తే తెలంగాణ): భూముల విలువలు, స్టాంపు డ్యూటీల పెంపు అనంతరం వివిధ ప్రాంతాల్లో పెరిగిన చార్జీలు ఇలా ఉండనున్నాయి.
హైదరాబాద్లోని చిక్కడపల్లి సబ్రిజిస్ట్రార్ పరిధిలో ఓపెన్ ప్లాటు చదరపు గజం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.15 వేలు ఉన్నది. దీని ప్రకారం 150 గజాలున్న ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.37,250 అవుతుంది. (ఇందులో అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులు 6 శాతం, మ్యుటేషన్ ఫీజు 0.1 శాతం కలిపి ఉన్నది).
తాజాగా పెంచిన విలువ ప్రకారం ఇదే ప్రాంతంలో భూమి విలువ రూ.21,000 కు పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతం పెరిగింది. మ్యుటేషన్ ఫీజు 0.1 శాతంతో కలుపుకొని 7.6 శాతం అవుతుంది. దీని ప్రకారం మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,39,400 అవుతుంది.
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ప్రస్తుతం.. గజం విలువ కనిష్ఠంగా 20 వేలు, గరిష్ఠంగా రూ.51 వేలు ఉన్నది. దీని ప్రకారం 150 గజాలున్న ఓపెన్ ప్లాటుకు గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠ విలువ ఉన్న చోట రూ.1.83 లక్షలు, గరిష్ఠ విలువ ఉన్న చోట రూ.4,66,650 అవుతుంది.
తాజా పెంపు ప్రకారం కనిష్ఠం 28 వేలు, గరిష్ఠం రూ. 66,500గా మారింది. దీని ప్రకారం 150 గజాల ఓపెన్ ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న చోట రూ.3,19,200, గరిష్ఠం ఉన్న చోట రూ.7,58,100.
బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ప్రస్తుతం.. ఓపెన్ ప్లాటు చదరపు గజం విలువ రూ.12 వేలు, గరిష్ఠం రూ.65 వేలుగా ఉన్నది. దీని ప్రకారం 150 గజాలున్న ఓపెన్ ప్లా టుకు రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న చోట రూ.1,09,800, గరిష్ఠం ఉన్నచోట రూ.5,94,750 అవుతుంది.
తాజా పెంపు ప్రకారం కనిష్ఠం రూ.17 వేలు, గరిష్ఠం రూ.84,500 అయింది. దీంతో కనిష్ఠం ఉన్న చోట రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1,93,800, గరిష్ఠం ఉన్న చోట రూ.9,63,300 అవుతుంది.
శేరిలింగంపల్లి సబ్రిజిస్ట్రార్ పరిధిలోని చందానగర్ గ్రామంలో ప్రస్తుతం.. ఓపెన్ ప్లాటు చదరపు గజానికి కనిష్ఠంగా రూ.9 వేలు, గరిష్ఠంగా రూ.30 వేలు ఉన్నది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న ప్రాంతాల్లో 150 గజాల ప్లాటుకు రూ.82,350, గరిష్ఠం ఉన్న చోట రూ.2,74,500 అవుతుంది.
తాజా పెంపు ప్రకారం భూముల విలువ కనిష్ఠంగా రూ.13,500, గరిష్ఠంగా రూ.39వేలు అయింది. ఈ క్రమంలో కనిష్ఠం ఉన్న చోట రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1,53,900, గరిష్ఠం ఉన్న ప్రాంతాల్లో రూ.4,44,600 అవుతుంది.
ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ప్రస్తుతం ఓపెన్ ప్లాటు చదరపు గజానికి కనిష్ఠంగా మార్కెట్ విలువ మల్లాపూర్లో రూ.1500, గరిష్ఠంగా జిల్లెల్లగూడలో రూ.15 వేలుగా ఉన్నది. దీని ప్రకారం 150 గజాలున్న ఓపెన్ ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు మల్లాపూర్లో రూ.13,725, జిల్లెల్లగూడలో రూ.1,37,250 అవుతుంది.
తాజా పెంపు ప్రకారం మల్లాపూర్లో గజం విలువ రూ.2,250, జిల్లెల్లగూడలో రూ.21వేలకు పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు 150 గజాల ప్లాటుకు మల్లాపూర్లో రూ.25,650, జిల్లెల్ల గూడలో రూ.2,39,400 అవుతుంది.
ఇప్పటివరకు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో గ్రౌండ్ఫ్లోర్లో ఒక శ్లాబు, ఫస్ట్ ఫ్లోర్లో ఒక శ్లాబు, ఆ పైన ఉన్న ఫ్లాట్లకు ఒక శ్లాబు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుచేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో ఈ విధానం ఎలా ఉంటుందనే దానిపై అధికారులకు సమగ్ర మార్గదర్శకాలు జారీ కానున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భూముల విలువను సవరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించి, పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి, అధ్యయన నివేదికలను తెప్పించుకొని.. సమాజంలో ఏ ఒకరి పైన భారం పడకుండా నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర ప్రజలతోపాటు.. రాష్ట్రానికి రాబోయే పెట్టుబడుల గురించి సైతం సీఎం ఆలోచించారు. ఫార్మా, ఐటి, డిఫెన్స్ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండాలని దార్శనికతతో ఆలోచించి శాస్త్రీయంగా భూముల విలువలను సవరించారు. గతంలో ఇష్టారీతిన ధరలు పెంచేవారు. ఈసారి సమగ్ర అధ్యయనం జరిగింది. అయినా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే భూముల విలువలు తకువగా ఉన్నాయి.
–పీ సుబ్బారావు, హైదరాబాద్ డీఐజీ (స్టాంపులు,రిజిస్ట్రేషన్లు)
భూముల విలువతోపాటుగా భవనాల విలువలను (స్ట్రక్చరల్ రేట్లు) సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈమేరకు మంగళవారం రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఐజీ శేషాద్రి ఆదేశాలు జారీ చేశారు. ఇండిపెండెంట్ ఆర్సీసీ భవనాలకు చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.1100గా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.900గా, ఆర్సీసీ కానీ భవనాలకు పట్టణ ప్రాంతాల్లో రూ.750గా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.600గా విలువను నిర్ణయించారు. ఫౌండేషన్స్థాయి వరకు మాత్రమే పూర్తయిన భవనాల విలువ 25%గా, స్లాబ్ స్థాయి వరకు పూర్తయిన వాటికి 65%, ఫినిషింగ్ స్థాయి వరకు పూర్తి అయిన భవనాలకు 85 శాతంగా విలువను నిర్ణయించారు. భవనాన్ని నిర్మించి పదేండ్లు దాటితే వాటి విలువలో ఎలాంటి మార్పులు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పది సంవత్సరాలకు పైబడిన భవనాల్లో ప్రతి సంవత్సరానికి ఒక శాతం చొప్పున విలువను తగ్గించవచ్చు. అయితే గరిష్ఠంగా 70 శాతం కంటే ఎక్కువగా తగ్గింపు చేయడానికి వీలులేదని స్పష్టంచేశారు. భవనాలు పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి సంబంధించినవనే అనే విషయాన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది.