ఈ నెల 29న అవార్డు ప్రదానం
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురసార్కానికి ఈ ఏడాది ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, బొడ్డుతాడు, తల్లికొంగు, గెజిట్, పిడికెడు కలలు.. దోసెడు కన్నీళ్లు వంటి కవితా సంపుటాలతో తెలంగాణ కవిత్వబాణిని జూకంటి బలంగా వినిపించారు. ఈయనది రాజన్న సిరిసిల్ల జిల్లా. తెలంగాణ సారస్వత పరిషత్తు, సినారె కుటుంబం ఆధ్వర్యంలోని సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా ఈ నెల 29న నిర్వహించే సినారె 90వ జయంత్యుత్సవంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తామని ఆ పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.