నిర్మల్ అర్బన్/మనోహరాబాద్, ఆగస్టు 8: నిర్మల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమై గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. పట్టణ సీఐ శ్రీనివాస్, స్థానికుల కథనం ప్రకారం.. నిర్మల్లోని దివ్యనగర్ కాలనీలో నివసిస్తున్న విజయ్చందర్ దేశ్పాండే అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకి ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో రెండు కార్లలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విజయ్చందర్ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. అడ్డుకోబోయిన విజయ్చందర్ కుటుంబీకులు, స్థానికులపై బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆ మార్గంలోని ఇతర పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ వాహనంలో, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ టోల్గేట్ వద్ద మరో వాహనంలో కిడ్నాపర్లు పట్టుబడ్డారు. వీరిలో హైదరాబాద్కు చెందిన కృష్ణారావు, సయ్యద్ అబ్ధుల్ ఖాదర్, యూసుఫ్ సయ్యద్, మహ్మద్ అబ్బాస్, సంగారెడ్డికి చెందిన గని కృష్ణ ఉన్నారు. వీరితోపాటు బాధితుడిని నిర్మల్ పోలీసులకు అప్పగించినట్టు తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ తెలిపారు. విజయ్చందర్ తండ్రి రాఘవేందర్ దేశ్పాండే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన విభేదాలే ఈ కిడ్నాప్కు కారణమని తెలుస్తున్నది.