హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ వచ్చింది. రాష్ట్రంలో అసమ్మతి గళం వినిపిస్తున్న వారికి వ్యతిరేకంగా నిలబడి, ముఖ్యమంత్రికి అండగా నిలిచేవారి ఫైళ్లు శరవేగంగా కదులుతున్నాయి. ప్రెస్మీట్ పెట్టే వారికి ముఖ్యనేత ఆంతరంగికుడు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని సుమారు 50 మంది ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. తొలుత అనేకమంది ముఖ్యనేతకు అనుకూలంగా మాట్లాడేందుకు ముందుకురాలేదు.
దీంతో ‘అన్నా.. మీరేదో ఫైల్ ఉన్నదని చెప్పిండ్రు కదా.. రేపు ఒకసారి వచ్చి కలువండి. అది చెప్పాలని ఫోన్ చేసిన. అట్లనే ఒకసారి వీలైతే మన పీఆర్వోలు ఒక నోట్ పంపుతారు. ప్రెస్మీట్ పెట్టి మాట్లాడండి అన్నా..‘ అంటూ ఆంతరంగికుడు ఎమ్మెల్యేలతో చెప్తున్నట్టు తెలిసింది. నల్లగొండ, వరంగల్ జిల్లాల నేతలకు ఎకువగా ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత ఫైల్ను క్లియర్ చేయాలని ఆ ఆంతరంగికుడు ఓ అధికారికి చెప్పినట్టు సమాచారం. ఆరు నెలలుగా తిరుగుతున్నా పని కానిది ఒక ప్రెస్మీట్తో అయిపోయినట్టేన ని ఆ ఎమ్మెల్యే తనను కలిసిన మరో యువ ఎమ్మెల్యేతో చెప్పడం గమనార్హం.
మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురుతోపాటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులకు వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టేందుకు అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై ముఖ్యనేత తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసి ంది. ‘20 మంది కూడా రాలేదా?’ అని విస్మయం వ్యక్తంచేసినట్టు స మా చారం. తనకు అనుకూలంగా మం త్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడకపోవడంపై రాష్ట్రంలోని ఒకరిద్దరు నేతలతో చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు తన రెస్యూలోకి రాని వాళ్లకు తగిన సమయంలో ఏం చే యా లో తెలుసునని అన్నట్టు తెలిసింది.