Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లోనే దాడి ఘటనను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. విచారణ పేరుతో వారిని పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి ముసుగులు ధరించిన 15 మంది పోలీసులు దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం ఈ దుశ్చర్యను కనిపెట్టి గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారని తెలిపారు.
పోలీస్ కస్టడీలో ఉన్న వారిపై పోలీస్ స్టేషన్లోనే దుండగులు వచ్చి దాడికి దిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదని వద్దిరాజు రవిచంద్ర నిలదీశారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా దాడికి దిగిందని మండిపడ్డారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడికి యత్నించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.