హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఇంట్లో హాయిగా సోఫాలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్నారా? అకస్మాత్తుగా వరదలు ముంచెత్తి ఇల్లు నీళ్లతో నిండిపోయిందా? మీరు కూర్చున్న సోఫానే బోట్గా మారిపోతుంది.. మిమ్మల్ని కాపాడేస్తుంది. అవును! అదిరేటి ఆవిష్కరణ ఇదే కదా. ఇలాంటి మరెన్నో ఆవిష్కరణల కు ఐఐటీ హైదరాబాద్ వేదికైంది. శుక్రవారం ఐఐటీహెచ్లో జాతీయ ఆవిష్కరణల వేడుక జరిగింది. ‘ఇన్వెంటివ్ 2024’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ప్రారంభించారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐసర్లకు సంబంధించిన 120 ఆర్అండ్డీ ఎగ్జిబిట్లు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. వాటిలో కొన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఫర్నిచర్ కమ్ ఎమర్జెన్సీ బోట్
వర్షాలు, వరదలు ముంచెత్తితే ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలను రక్షించేందుకు ఫర్నిచర్ కమ్ ఎమర్జెన్సీ బోట్ను ఎన్ఐటీ తిరుచ్చి అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ ముత్తుకుమరన్ నేతృత్వంలోని బృందం మల్టిపర్పస్ బోట్ను తయారుచేసింది. గ్లాస్ ఫైబర్, సహజ ఫైబర్, పాలిమర్స్ను వినియోగించి ఈ బోట్ను రూపొందించినట్టు ఆయన తెలిపారు. దీనిని సాధారణ సమయాల్లో సోఫాగా, వరదల సమయంలో బోట్గా వాడుకోవచ్చని వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదల సమయంలో ఆహారప్యాకెట్లు, నీళ్లు, మందులను ఈ బోట్ ద్వారానే అందించామని వెల్లడించారు. మిగతా పడవల్లా ఇది బోల్తాపడే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు.
యాక్సిడెంట్లను ముందే కనిపెట్టే ‘ఐ రాస్తే తెలంగాణ’
సెల్ఫోన్ డ్రైవింగ్, సిగరెట్లు తాగటం, వాహనదారుల అజాగ్రత్త వంటి చిన్న పొరపాట్లతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇవి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కన్నా.. ప్రమాదాలను ముందే అరికడితే మంచిదన్న ఆలోచనతో ‘ఐ రాస్తే తెలంగాణ’ ప్రాజెక్ట్ను ఐఐఐటీ హైదరాబాద్ రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రోడ్ సేఫ్టీ సొల్యూషన్స్ను రూపొందించినట్టు ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థి పృథ్వీ తెలిపారు. వాహనం ఢీకొట్టనున్నదని ముందే హెచ్చరించడం, సెల్ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అప్రమత్తం చేయటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అని వివరించారు. తమ ప్రాజెక్ట్ ఇప్పటికే నాగపూర్లో అమలు అవుతున్నదని, దీనితో 60 శాతం రోడ్డు ప్రమాదాలు ముందే నివారించవచ్చని వెల్లడించారు.
స్నైపర్ గన్స్ నుంచి కాపాడే జాకెట్
స్నైపర్గన్స్ నుంచి భద్రతా బలగాలను కాపాడే అడ్వాన్స్డ్ బాలిస్టిక్ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ను ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు వాడుతున్న బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లతో ఏకే 47లను నుంచి మాత్రమే కాపాడుకునే వీలుండగా, ఈ జాకెట్ స్నైపర్ గన్స్ నుంచీ కాపాడుతుంది. డీఆర్డీవో సహకారంతో ఐఐటీ ఢిల్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమంత్ చౌహాన్ నేతృత్వంలోని బృందం ఈ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ను తయారుచేసింది. ప్రసుతం భద్రతాబలగాలు వాడుతున్న జాకెట్ల బరువు 10.2 కిలోలు కాగా, ఈ జాకెట్ బరువు 8.1 కిలోలు మాత్రమే.
గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్
గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు, మరీ ముఖ్యంగా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు మృతులు, క్షతగాత్రులను గుర్తించడం కష్టం అవుతున్నది. దీనికి ఐఐటీ జోద్పూర్ పరిశోధకుల బృందం పరిష్కారాన్ని కనుగొన్నది. ‘పరిచయ్ ఫేస్ రికగ్నిషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ సోషల్ గుడ్’ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసింది. ఐరిస్తో ఈ ప్రాజెక్ట్ను అనుసంధానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తి ముఖాన్ని, కండ్లను స్కాన్ చేస్తే ఎవరో గుర్తించటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. యూఐడీ సహా ఈ-కేవైసీతోనూ ఈ ప్రాజెక్ట్ను అనుసంధానించవచ్చు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన సందర్భంలో ఈ ప్రాజెక్టును అమలుచేసి, 120 మందిని గుర్తించారు. దీనితో డీప్ ఫేక్ను కూడా నివారించవచ్చు.