హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర చైర్మన్ వీ రవీందర్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు వీ సత్యమూర్తి, జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టర్లు నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మిస్తూ, కోట్లాది ప్రజలకు సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. కొన్నేండ్లుగా పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బ్యాంకులు, ప్రైవేటు రుణదాతల ఒత్తిడి పెరిగిపోయి కాంట్రాక్టులు ఆర్థికంగా కుదేలవుతున్నారని వాపోయారు. ఇప్పటికే 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నట్టే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామ్యులైన కాంట్రాక్టర్లను విస్మరించవద్దని కోరారు. ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, పరోక్షంగా అనేక కుటుంబాల జీవనోపాధికి కారణమవుతున్న కాంట్రాక్టర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
బీఏఐ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లకు భరోసా కల్పించకపోతే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం వెంటనే సమావేశం ఏర్పాటు చేసి బిల్లుల విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.