నారాయణఖేడ్, ఏప్రిల్ 21: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగార్బొగుడ తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్ (22) దారుణహత్యకు గురయ్యాడు. తండాలో సీసీరోడ్డు పనుల విషయంలో తలెత్తిన వివాదం పెద్దది కావడంతో శనివారం శ్రీనునాయక్ను పలువురు పంచాయితీ పేరుతో పిలిచి రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలపాలైన శ్రీనునాయక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే శ్రీనునాయక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీనునాయక్ హత్య ముమ్మాటికీ రాజకీయ కక్షతోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాడనే అక్కసుతోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన అభివృద్ధి పనులు చేపడుతుండటంతో ఈ వివాదం తలెత్తిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు.