BRSLP Meeting | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్న ది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆయా వర్గా ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠ ఏ విధంగా మసకబారుతున్నది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏయే చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.