KTR : ‘నల్లగొండ-వరంగల్-ఖమ్మం’ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదేనని, ఓటర్లు ఆలోచించి ఓటయ్యాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లూ గులాబీ పార్టీయే గెలుస్తూ వస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయంకృషితో పైకి వచ్చాడని, హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నడని, విభజన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.
యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్ళు గుడికట్టి ఓట్లడుగుతున్నారని, అలాగైతే మనం కూడా యాదాద్రి ఆలయం కట్టామని అన్నారు. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని గుర్తుచేశారు. చేసిన పని సరిగా చెప్పుకోలేక పోయామని, అందుకే ఓటమి పాలయ్యామని అన్నారు.
మా పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తున్నదని విమర్శించారు. ఇవాళ తెలంగాణ ఆగమైందని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి అన్నింటిని మర్చిపోయిందని అన్నారు. ప్రశ్నించే గొంతుక, ధిక్కార స్వరం అయిన రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. వాటి జాయినియంగ్ లెటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డివి పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. మన అభ్యర్థి రాకేష్ రెడ్డి విద్యావంతుడని, ఆయన ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మైలర్ అని, సొల్లు కబుర్లు చెప్పే మోసగాడని అన్నారు.