KTR | హైదరాబాద్ : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు. మూసీ వల్ల, హైడ్రా వల్ల ఎంతో మంది బాధితులుగా మారారు. చాంద్రాయణ గుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపిస్తాయి. హైదరాబాద్లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాం. వైట్ హౌస్ను తలదన్నేలా సచివాలయం కట్టాం. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. హైదరాబాద్లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు కట్టుకున్నాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టుకున్నాం, నీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఒకటి రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేసుకున్నాం అని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే. ఈ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. ఎవ్వరు కూడా ఇంత అన్యాయంగా, కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం.. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. ఒక ఇంటి గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూలగొట్టింది. ఒక గర్భిణిని పక్కకు తోస్తే ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలి. మూడేళ్ల చిన్నారి భోజనం లేకండా ఏడ్చిన పరిస్థితి. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్ధం కావాలి అని కేటీఆర్ అన్నారు.

హైడ్రాపై భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ రోజు భట్టి విక్రమార్క ఇచ్చిన ప్రజంటేషన్లో చాలా విషయాలు చెప్పారు. ఆయన చాలా బిల్డర్ల పేర్లు చెప్పారు కానీ.. మేం ఏ బిల్డర్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.. పేదవాడి ఇంటికి బుల్డోజర్ వచ్చింది.. ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి. పేదలు కోరుకునేది ఒక్కటే కూడు గూడు గుడ్డ.. అలాంటి పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేసింది. ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదు.. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్లు? రూల్స్ అతిక్రమిస్తే కాపాడాలని మనమేం చెప్పట్లేదు. పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని చెబుతున్నారు. ఇలా చేస్తుంటే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు.. కోర్టులు ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫుల్ ట్యాంక్ లెవల్లో కడితే ఎవరిని వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. ఈయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి.. ఆయన ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తారా? మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది ఏ తప్పులేదు. పేదలకు అసలు టైమ్ ఇవ్వరు.. తిరుపతి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా? మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి.. వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా? పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు, ఇల్లులు కట్టుకున్నా అడిగేవారు లేరు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాలకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు. మాకు హద్దులు చూపించడం లేదు.. హద్దులు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయం ఉంటుందా? ఈ షీట్లు వేసింది కూడా అధికారులే అని కేటీఆర్ తెలిపారు.
మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్ను కూడా ఇప్పటి వరకు ఆపలేదు.. ఆ ధైర్యం హైడ్రాకు ఉందా? పెద్ద బిల్డర్లు కడితే వారికి సహకరించి.. తానా తందానా ఆడతారు. మూసికి అడ్డంగా ఆకాశమంత పెద్దగా కడితే కూడా వారికి కనిపించదు. మంత్రులు, పెద్ద పెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. కానీ పేదల పైకి బుల్డోజర్లు పంపిస్తారు. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకించేది. బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే తెలంగాణలో బుల్డోజర్ ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఇది తప్పు అని.. రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదు? అని కేటీఆర్ నిలదీశారు.
కొండాపూర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. హైడ్రా చేసేది న్యాయమే అయితే.. అర్ధరాత్రి ఎందుకు వస్తున్నట్లు? నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? పేపర్లు చూడటానికి ఏం ఇబ్బంది ఉంది? ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని మాట్లాడారు. తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయండి అని చెప్పంది కూడా రేవంత్ రెడ్డే. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు? ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు. మీకు మళ్లీ హామీ ఇస్తున్నా.. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. 500 రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. బాధితులకు అండగా ఉంటాం. మేం పదేళ్లలో ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు.. అదే బాధ్యతతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.