హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. అందుకే పోలీసులతో మాపై దాడి చేయించారు. మా మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీరపట్టుకొని లాగారు. నా గొంతుపట్టుకొని దాడికి యత్నించారు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. వారి ప్రవర్తన చూస్తే పోలీసులా? వారి ముసుగులో ఉన్న గూండాలా? అనే అనుమానం కలుగుతున్నదన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో సబితారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసుకున్న టీషర్ట్స్పై అభ్యంతరకరమైన పదాలు ఏం లేవు. మోదీ, అదానీ చిత్రాలతో కూడిన టీషర్ట్ వేసుకొని రాహుల్ పార్లమెంట్కు వెళ్లవచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేసుకోవద్దా? అక్కడో న్యా యం.. ఇక్కడో న్యాయమా? ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?’ అని ప్రశ్నలవర్షం కురిపించారు.
గతంలో జీవో 97 రద్దు చేయాలని నిరసన తెలిపిన పాలిటెక్నిక్ విద్యార్థులను గొంతుపట్టుకొని పిసికారని, ఇప్పుడు ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న తమ గొంతు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి తొక్కేవారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఘటనను ఖండించాల్సిన మహిళా మంత్రి సీతక్క డ్రామాలాడుతున్నారని, తమపై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. వెయ్యి రోజుల పాలనపై ప్రశ్నిస్తామని, హామీల అమలుపై నిలదీస్తామని భయపడే ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కిందని ధ్వజమెత్తారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న తమపై పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభు త్వం దాడి చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతు న్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ‘మహిళలనే సోయిలేకుండా ఇష్టారీతిన వ్యహరించారు. చీరను లాగి, గొంతుపై చేతులు వేసి నొక్కారు. ఈ దుర్మార్గం మాకే కాదు తెలంగాణ మహిళలందరికీ అవమానం. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరుగలేదు. ప్రజాస్వామ్యంలో నేడు చీకటిరోజు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు?’అని నిలదీశారు. తన 27 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ సభ్యులకు హక్కులేదా? అని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేసుకున్న టీషర్ట్లపై హామీలు అమలు చేయాలని మాత్రమే రాసి ఉన్నదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నిత్యం మాట్లాడే బూతు భాష ఆ షర్ట్స్పై లేదని దెప్పిపొడిచారు.