హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్పై, ప్రభుత్వంపై చంద్రబాబు అవాకులుచెవాకులు పేలడం సరికాదని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగమని, ప్రపంచంలోని ప్రగతికాముకులు అందరూ అంగీకరించే సత్యమని చెప్పారు.
ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేయడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. చంబ్రాబు తన రాజకీయ జీవితంలో ఓడిన ప్రతీసారి అహంకారం వల్లే ఓడిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది సానుభూతి ప్రకటించారని, చంద్రబాబులా అహంకారపూరిత వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే అందరికి మంచిదని సూచించారు.