హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి విరుద్ధంగా కొడంగల్, కొండారెడ్డిపల్లిలో రెండు ఓట్లు కలిగి ఉన్న సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి రేవంత్రెడ్డి నేరం చేసినందున ఆర్వోపీఏలోని సెక్షన్-31 ప్రకారం ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి ఏడాది జైలు శిక్ష విధించాలని స్పష్టంచేశారు. ‘హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓట్లు కలిగి ఉన్నారనే కారణంతో సినీ నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు చేయలేదా? అఫిడవిట్లో కేసు వివరాలు చూపలేదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ను ఎంపీ ఎన్నికలకు డిస్క్వాలిఫై చేయలేదా? మరి వారికో న్యాయం.. రేవంత్రెడ్డికి మరో న్యాయమా?’ అని సూటిగా ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కల్వకుర్తి శ్రీనివాస్, గౌతమ్ప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
గతంలో రేవంత్రెడ్డి కొండారెడ్డిపల్లి, కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చిత్రాలను మీడియాకు చూపి రేవంత్రెడ్డి రెండు ఓట్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ‘రేవంత్రెడ్డికి టీఈఎస్ 0274035 ఎపిక్ నంబర్తో సీరియల్ నంబర్ 974తో కొడంగల్లో, 601 నంబర్తో కొండారెడ్డిపల్లిలో ఓటు ఉన్నది. మరి రెండుచోట్ల ఓటు ఉన్న రేవంత్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపి నేరం చేశారు’ అంటూ తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొడంగల్ ఎన్నిక రద్దయి.. నేరం చేసిన రేవంత్రెడ్డికి శిక్షపడేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని తేల్చిచెప్పారు.
‘ఫ్యాక్ట్ చెక్’ స్పందించడంలో మర్మమేంటి?
ముఖ్యమంత్రి రెండు ఓట్లపై స్పందించాల్సిన స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మౌనం వహించడం.. ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ సీఎం ఆఫీస్ నుంచి స్పందించడం, రేవంత్రెడ్డికి రెండు ఓట్లు లేవని నాగర్కర్నూల్ కలెక్టర్ ప్రకటించడంలోని మర్మమేంటని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయని ఫ్యాక్ట్చెక్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చి రాత్రికిరాత్రే తొలగించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని నడిపేది సుదర్శన్రెడ్డా? రేవంత్రెడ్డా? అని నిలదీశారు. సీఈవో బదులు స్పందించిన ఫ్యాక్ట్చెక్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రెండు ఓట్లు ఉన్నాయని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్కర్నూల్ కలెక్టర్ మీడియాను బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. రేవంత్ రెండు ఓట్ల వ్యవహారంలో సీఈవో స్పందించకపోవడం చూస్తుంటే ’సర్’ పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపణలపై ప్రశ్నించగా బండి సంజయ్, రేవంత్ కూడబలుక్కొని రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నిరాధార ఆ రోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లో తనను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన బాలరాజు ఇప్పుడు త ప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నారని ప్రశ్నించారు.
బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యుడే
షాబాద్ పోక్సో కేసులో హంతకుడికి కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు భిక్షపతి బెయిల్ ఇప్పించారని ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలికి సోదరుడు లేకపోయినా ఉన్నాడని చెప్పి జడ్జికి తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.