హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం, సంవత్సరాల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తుండటంపై గ్రేటర్వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్నాక నుంచి రామంతాపూర్ వరకు, ఉప్పల్ రింగురోడ్డు నుంచి నారపల్లి వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం ఐదేండ్లు గడిచినా 40శాతం కూడా పూర్తి కాలేదు. మే 5, 2018న పని ప్రారంభించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ఫ్లై ఓవర్ను కడతారంటూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ మంగళవారం పిల్లర్లపై వెలిసిన పోస్టర్లు విస్తృత చర్చకు దారి తీశాయి. నిర్మాణం జరుగుతున్న ఈ రెండు మార్గాల్లో వాహనదారులు పోస్టర్లను ఆసక్తికరంగా తిలకించి కేంద్ర వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకీ ఈ నిర్లక్ష్యం మోదీ అంటూ ప్రశ్నించారు. కేంద్రం పనుల నత్తనడకకు ఇదే నిదర్శమన్నారు. ఆలస్యమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నదని విరుచుకుపడుతున్నారు. త్వరితగతిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.