గజ్వేల్/వరంగల్: నవంబర్ 28: గజ్వేల్ గర్జించింది.. వరంగల్ పోటెత్తింది.. మంగళవారం సీఎం కేసీఆర్ ఆఖరురోజు పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు సూపర్హిట్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల సభలకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పోటెత్తారు. ఈ రెండు సభలతో కలిపి జననేత కేసీఆర్ 96 ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొనడం విశేషం. గులాబీ శ్రేణులు, ప్రజల రాకతో వరంగల్ నగరం, గజ్వేల్ పట్టణం గులాబీమయం అయ్యాయి. గజ్వేల్లో ఐవోసీ సమీపంలోని మైదానంలో నియోజకవర్గంలోని మర్కూక్, వర్గల్, ములుగు, కొండపాక, కుకునూర్పల్లి, జగదేవ్పూర్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎటుచూసినా గులాబీ కండువాలు, కేసీఆర్, కారుగుర్తుతో కూడిన పెద్ద జెండాలతో జనం కనిపించారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఈ సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో రోడ్లపై, పక్కనే ఉన్న దుకాణాలు, పెద్ద భవనాలపై నుంచి ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. కేసీఆర్ గజ్వేల్ వస్తున్నాడని తెలుసుకున్న పలువురు మహిళలు చంటి పిల్లలతో సహా సభకు తరలివచ్చి కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం కనిపించింది. కేసీఆర్ ప్రసంగ సమయంలో జనం నుంచి ఉప్పెనలా జన నినాదాలు మార్మోగాయి. ప్రజా కళాకారులు ఏపూరి సోమన్న, మధుప్రియ పాటలకు సభకు వచ్చిన జనం ఆడిపాడారు. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ను ఉద్దేశిస్తూ బైబై రేవంతు.. నువ్వొచ్చుడొద్దు.. అంటూ కళాకారుడు మానకొండూరు ప్రసాద్ పాడిన పాటకు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రతిగా జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. అంటూ రాగం కలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజవర్గాల గులాబీ దండు కదం తొక్కింది. సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో వరంగల్ నగర వీధులు ఎటూచూసినా గులాబీమయంగా కనిపించాయి. చీమల బారులా సభకు ప్రజలు ర్యాలీగా కదిలివచ్చారు. ఎన్నికల ప్రచారపర్వం ఆఖరు రోజు నిర్వహించిన ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్తోపాటు ఇతర నేతల్లో ఆనందం వెల్లువెత్తుతతున్నంది. కేసీఆర్ సభ అభ్యర్థులు నరేందర్, వినయ్భాస్కర్కు కలిసొస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.