BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలికింది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న భారత రాష్ట్ర సమితి.. మరాఠ్వాడాలో మూడో బహిరంగసభను విజయవంతంగా నిర్వహించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై దాదాపు అరగంటకు పైగానే ప్రసంగించారు. తన ప్రసంగానికి ముందుకు మరాఠా వైతాళికులకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.
మేకిన్ ఇండియా అంటారు.. నగరంలో వీధి వీధికో చైనా బజార్ ఉంటది. డిజిటల్ ఇండియా మజాక్ అయింది.. మేకిన్ ఇండియా జోక్ అయింది. మహారాష్ట్రలో మంత్రులు కేబినెట్ ఉంటుంది.. కానీ చీఫ్ సెక్రటరీ ఎందుకు ఉండరు..? పెద్ద రాష్ట్రమని చెప్పుకునే మహారాష్ట్రలో చీఫ్ సెక్రటరీ ఉండరా..?
కేసీఆర్కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను. మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చేయ్.. 24 గంటల కరెంట్ ఇవ్వండి. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు. నూతనంగా నిర్మించే పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి.
తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. సాగునీరు అందిస్తున్నాం. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో ప్రతీ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నాం. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. మరి మహారాష్ట్రలో ఇవి ఎందుకు అమలు కావడం లేదు. ఇంకెంతకాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి. కాబట్టి ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.
కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్పై నమ్మకం ఉంచండి. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించలేదు. దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పడింది. మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది. అన్ని వర్గాల వారికి సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకు వెళ్లదు. మార్పును తీసుకు వచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టింది.
మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఐదేండ్లలోనే ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగేనీటినే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు ప్రజలు కూడా తాగుతున్నారు. ఇక్కడ కూడా ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ఉచిత కరెంట్ ఇస్తాం. రైతులను ఆదుకుంటాం. తాగేందుకు నీరు లేదు.. యువతకు ఉద్యోగాల్లేవు. కావాల్సిన దాని కంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉంది.
దేశ ప్రజల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. పోరాటంలో నిజాయితీ ఉంటే విజయం దానంతట అదే సిద్ధిస్తుంది. దేశంలో మార్పు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తాం. అదేదో కిరాయి ఆఫీసుల్లో కాదు.. స్వతహాగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మిస్తాం.
దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదు.. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంది. పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు ఆకాంక్ష గెలవడం ముఖ్యం. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉంది. ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడుతాం. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కూనరిల్లుతుంది. చైనా ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరింది. సింగపూర్, కొరియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి.
ఔరంగాబాద్, అకోలలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారికి తాగునీటి సమస్య కనిపించడం లేదా..? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా..? ఇంటికి పంపించాలా..? అనే విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత ఆలోచించండి. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది..? లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.
ఇప్పటికీ సాగు, తాగు నీరు అందడం లేదు. సాగు, తాగు నీరు అందకపోవడం ఎవరి పాపం? ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందట్లేదు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా వంటి నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలెందుకు..? ముంబై దేశ ఆర్థిక రాజధాని, కానీ తాగేందుకు నీళ్లుండవా..? దేశం పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..? ఆలోచించండి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది.. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం. అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్ఎస్కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలను విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులతో చర్చించండి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే అంశంపై చర్చ పెట్టండి.
మహారాష్ట్ర వైతాళికులై ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీ భాయి ఫూలేతో పాటు పలువురు మహానీయులకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.
సభా వేదికపై నుంచి మరాఠా ప్రజలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. ఔరంగాబాద్కు చెందిన నాయకులకు కూడా కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ సమక్షంలో పలువురు నాయకులు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
ఔరంగాబాద్ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఇంటికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన నివాసం వద్ద కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నేరుగా కైలాష్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. గతంలో వైజాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అభయ్ పాటిల్. మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగాబాద్కు చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్ బయల్దేరిన కేసీఆర్.. కాసేపటి క్రితం ఛత్రపతి శంభాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.
శంభాజీపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో 2011 జనాభా లెక్కల ప్రకారమే 11 లక్షలకు పైగా జనాభా ఉన్నది. పట్టణానికి నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఒక్క డ్యామ్, రిజర్వాయర్ కూడా లేదు. పట్టణానికి తొలుత హర్సూల్ లేక్ నుంచి కొద్ది మొత్తంలోనే నీరు సరఫరా అయ్యేది. ప్రస్తుతం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయక్వాడీ డ్యామ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి, పట్టణానికి సరఫరా చేస్తున్నారు. జయక్వాడీ డ్యామ్ ఎప్పుడూ పూర్తిగా నిండిన సందర్భాలు లేవు. ఒక ఏడాది నిండితే ఆరేండ్ల వరకు కూడా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండని పరిస్థితి. డ్యామ్ నుంచి పట్టణానికి వేసిన పైప్లైన్ కూడా 700 ఎంఎం.. అది కూడా 30 ఏండ్ల క్రితం వేసింది కావడం గమనార్హం. సరఫరా చేస్తున్న నీరు పెద్ద మొత్తంలో లీకేజీ అవుతుండటంతో పట్టణంలో తాగునీటి కటకట నెలకొన్నది. పైఠాన్ డ్యామ్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.1,630 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి మూడేండ్లు అవుతున్నా అది ముందుకు కదల్లేదు.
‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్రంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నది. జిల్లా కేంద్రంలో వారానికి ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో 8 రోజులకు ఒకసారి నల్లా ద్వారా, అది కూడా ఒక గంటకు మించి ఇవ్వడం లేదు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిలో సగటున 50-60 రోజులు కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు. ఇచ్చే నీరు అంతంత మాత్రమే కావడంతో వచ్చినప్పుడే నిల్వ చేసుకొనేందుకు ప్రతి ఇంట్లో ట్యాంకులు, డ్రమ్ములే దర్శనమిస్తున్నాయి. నీటిని రోజుల తరబడి నిల్వ చేస్తూ తాగడంతో రోగాలబారిన పడుతున్నామని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నంత వరకు నీళ్ల కష్టాలు అంటూ నాయకులు మాట్లాడుతరు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్తరు. అధికారంలోకి వచ్చినంక పట్టించుకోరు. ఔరంగబాద్ పేరును అయితే మార్చారు కానీ తాగునీటి కష్టాలను తీర్చలేదు. మున్సిపల్ కార్పొరేషన్కు బిల్లును కట్టే బదులు ఆ పైసలు పెట్టుకొని బయట కొనుక్కునేడు నయం. అంతలా బిల్లులు వసూలు చేస్తున్నరు. – విజయ్శర్మ, శంభాజీనగర్ పట్టణవాసి
మా తాగునీటి గోస ఎంత చెప్పుకున్నా ఒడవదు. వారంలో ఒకసా రి ఇస్తారు. ఒక్కోసారి అయితే 8 రోజులకు ఒకసారి నీళ్లు వస్తయ్. ఆ ఇచ్చేది కూడా కేవలం 40 నిమిషాలు మాత్రమే. పనులన్నీ వదులుకొని నీళ్లు పట్టుకుంటం. ఈ కార్ఖానా ఏరియాలో అయితే ఇంతకుముందు కనీసం 10 గంటలపాటు నీళ్లు ఇచ్చేటోళ్లు. ఇప్పుడు 3 గంటలు కూడా ఇస్తలేరు. నీళ్లు లేకనే కొన్ని కంపెనీలు మూతపడ్డయ్. – అశోక్ పాక్రే, శంభాజీనగర్ పట్టణవాసి
హైదరాబాద్ సంస్థానంలో తొలి రాజకీయ పార్టీగా 1937లో స్టేట్కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించగా, దీని ప్రథమ సమావేశం ఔరంగాబాద్లోనే జరిగిందని స్వాతంత్ర సమరయోధుల కథనం. కాగా స్టేట్కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం ఎల్లారెడ్డిని అరెస్ట్ చేసి కొంతకాలం పాటు ఔరంగాబాద్ జైలులోనే నిర్బంధించారు. హైదరాబాద్ సంస్థానంలో ఖద్దర్ పరిశ్రమను అభివృద్ధి పర్చటానికి అన్నాసాహెబ్ సహస్రబుద్దేను మహారాష్ట్ర చరఖా సంఘం పంపించింది. చేనేత కార్మికుల సమస్యలపై 1946లో సిరిసిల్లలో జరిగిన మహాసభకు బొంబాయి, సోలాపూర్, అహ్మదాబాద్ నుంచి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో హైదరాబాద్తోపాటు ఔరంగాబాద్ కేంద్రంగా అనేక ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. హైదరాబాద్ స్టేట్లో అరెస్ట్ చేసిన అనేక మంది సమరయోధులను ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లలో బంధించేవారు. 1938లో వందేమాతరం గీతం ఆలపించడాన్ని నిషేధించారు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఆలపించిన విద్యార్థులను ఎక్కడా చదువుకోకుండా ప్రభుత్వం నిషేధించగా.. వారంతా మహారాష్ట్రలోని నిజాం పాలనలోనే నాగపూర్, పుణే వంటి పట్టణాలకు వెళ్లి చదువుకున్నారు. అలా వెళ్లినవారిలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరు. మొట్టమొదట వందేమాతర ఉద్యమం ఔరంగాబాద్లోనే ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెప్తారు. ఔరంగాబాద్ ప్రభుత్వ కాలేజీలో అప్పటి అధ్యాపకుడు గోవిందదాసు విద్యార్థులలో దేశభక్తి భావాలు పెంపొందిపజేసి వందేమాతర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇది తెలంగాణలోని కరీంనగర్కు మొదట పాకి ఆ తర్వాత 1939లో సంస్థానమంతా వ్యాపించింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్తో హైదరాబాద్కు విడదీయరాని అనుబంధమున్నది. నిజాం పాలనలో ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగం. ఈ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అందులో తెలంగాణకు చెందిన 8 జిల్లాలు, మహారాష్ట్రకు చెందిన 5 జిల్లాలు (ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భణి), కర్ణాటకకు చెందిన 3 జిల్లాలు (బీదర్, గుల్బర్గా, రాయచూర్) ఉన్నాయి. సంస్థానంలో తెలంగాణ జనాభా 90 లక్షలు, మరాఠ్వాడా జనాభా 45 లక్షలు, కర్ణాటక జనాభా 20 లక్షలు.
మహారాష్ట్రతో తెలంగాణకు రాజకీయ అనుబంధం ఈనాటిది కాదు. తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు పర్యాయాలు మహారాష్ట్ర నుంచే లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. మహారాష్ట్రలోని రాంటెక్ లోక్సభ స్థానం నుంచి పీవీ నరసింహారావు 1984-89, 1989-91 వరకు వరుసగా రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు.. ప్రస్తుత ఔరంగాబాద్ ఎంపీగా ఉన్నది కూడా హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ అభ్యర్థే కావటం గమనార్హం. స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా మద్రాసుకు వెళ్తే.. తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా మహారాష్ట్రకు వెళ్లేవారు.
ఔరంగాబాద్కు హైదరాబాద్తో పూర్వం నుంచి ఉన్న అనుబంధం ఇంకా అలాగే కొనసాగుతున్నది. ఇప్పటికీ ఇక్కడి ఆహార అలవాట్లు, వంటకాలు, రుచులు హైదరాబాద్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీ, పలావ్కు ఔరంగాబాద్ పెట్టింది పేరు. ఇక భాష, యాస విషయానికొస్తే సేమ్ టు సేమ్. హిందీ-ఉర్దూ మిళితమై వినసొంపుగా ఉండే దక్కని యాసలోనే ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు.
నాకు 4 ఎకరాల భూమి ఉంది. సా గునీటి వసతిలేక వ్యవసాయం వదిలేసి టీ కొట్టు నడుపుకుంటున్నా. ఇక్కడి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. -జ్ఞానేశ్వర్, టీకొట్టు యజమాని, జాల్నా
ఔరంగాబాద్లో కనీస వసతులు లేవు. తాగునీటికి ని త్యం కటకటే. భూగర్భజలాలు అడుగంటాయి. మంచినీటికి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి. ప్రజా సంక్షేమ పాలనలో ఇక్కడి పాలకులు విఫలమయ్యారు. -రాజారాం, చిరు వ్యాపారి
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా ఇక్కడ వ్యవసాయం మారలేదు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా ముందుకొచ్చిన కేసీఆర్కే ఈ సారి ఓటు వేస్తా. -చంద్రకాంత్ పాండే, పాండేస్ కోచింగ్ సెంటర్, ఔరంగాబాద్
బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఔరంగాబాద్ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఔరంగాబాద్కు వెళ్లారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. మహారాష్ట్రలో గతంలో నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.