హైదరాబాద్ : అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్ని అబ్బురపర్చేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మంలో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అభినందించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకుని, బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఎంపీ నామా హరీశ్ రావును కలిసి, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకుని, సభ ముగిసేంత వరకు జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ సభ విజయవంతానికి దగ్గరుండి, ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. పండుగ రోజుల్లో కూడా ఆయన ఖమ్మంలోనే మకాం వేసి, సభ ఏర్పాట్లను పర్యవేక్షించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, నాయకులందర్నీ ఏక తాటి పైకి తీసుకొచ్చి, జన సమీకరణ చేయించి, ఊహించిన దానికంటే మిన్నగా సభను సక్సెస్ చేయించిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందన్నారు.
రేయింబవళ్లు నాయకులందరితో మాట్లాడుతూ సభ గురించి, వారిలో ఉత్సాహం, చైతన్యం నింపి, ప్రధాన భూమిక వహించారని నామా కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను, మంత్రులను నిద్ర పోనివ్వకుండా సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమించారని అన్నారు. ఆయన కృషి, పట్టుదల, శ్రమ ఫలితంగానే యావత్ దేశం అబ్బురపడేలా సభ సక్సెస్ చేసుకోగలిగామని నామా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భవిష్యత్లో పార్టీ నుంచి ఏ పిలుపు వచ్చినా ఇదే స్ఫూర్తితో పని చేస్తామని నామా స్పష్టం చేశారు. కేసీఆర్ పిలుపుతో ఊరూవాడా కదలి, సభకు లక్షలాదిగా తరలివచ్చిన సామాన్య కార్యకర్తలకు, నాయక త్వానికి పేరు పేరునా నామా నాగేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు.