హైదరాబాద్: విద్యుత్ మీటర్ల విషయంలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై బురదజల్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించిన అంశంపై అసెంబ్లీలో చర్చించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి అడ్జెంట్మెంట్ నోటీసులిచ్చారు. శనివారం శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చలో భాగంగా విద్యుత్ మీటర్ల అంశంపై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఈ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు బిగించకపోతే అగ్రిమెంట్ను ఉల్లంఘించామని కేంద్ర ప్రభుత్వం డిస్కంలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు మెడమీద కత్తి వేలాడుతున్నది. గత ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాలు రాష్ర్టానికి గుదిబండగా మారాయి. తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్శాఖకు విధిలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లోనే వినియోగదారులకు స్మార్ట్మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమాధానమివ్వడానికి బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. నేపథ్యంలో నేడు ఈ అంశంపై సభలో చర్చించాలని కేటీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.