హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా తాము చర్చకు సిద్ధమని.. మీరూ సిద్ధమా? అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు వస్తే డాటాతో అర్వింద్ తాట తీస్తామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అర్వింద్కు లేదని అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీలు వీ గంగాధర్గౌడ్, యెగ్గె మల్లేశంతో కలిసి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి డీ శ్రీనివాస్పై కేటీఆర్ గౌరవంగా మాట్లాడితే కూడా అర్వింద్ జీర్ణించుకోలేకపోతున్నారని.. రాజకీయాల్లో అర్వింద్ ఓ కుసంసారి అని అన్నారు.
దావోస్ వెళ్లి 52 మీటింగులు పెట్టి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు సాధించింది మంత్రి కేటీఆర్ కాదా? అని నిలదీశారు. అబద్ధాలు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2,500 కోట్లు కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. కరెంటు లేదంటున్న అర్వింద్, ఓసారి కరెంటు తీగలను పట్టుకోవాలని సూచించారు. ఈటల రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు అర్వింద్ను తరిమినట్టే తరిమికొడుతారని అన్నారు. నందిపేటలో సర్పంచ్ దంపతుల ఆత్మహత్య యత్నం బీజేపీ కుట్రే అని ఆరోపించారు. బిల్లులు రాలేదన్న కారణంతో వాళ్లు ఆందోళన చేయలేదని, టెన్షన్లో అలా చేశానని ఆ సర్పంచ్ తర్వాత చెప్పారని స్పష్టంచేశారు.
దేశానికి కాబోయే ప్రధాని కేసీఆరేనని జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ప్రజలకు ఏమీ ఇవ్వని మోదీ దేవుడైతే.. అన్నీ ఇస్తున్న కేసీఆర్ ఏమవుతారు? నిజమైన దేవుడు కేసీఆరే అని అన్నారు. బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని చెప్పారు.