హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించటంపై పార్లమెంటు వేదికగా నిరసన గళాన్ని వినిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. సోమవారం పార్లమెంట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పార్లమెంటు నిర్ణయం సరైనది కాదని బీఆర్ఎస్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడిగా, బ్లాక్ డేగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఆవరణలోనూ జరిగే ఆందోళనల్లో నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించింది.