ఖలీల్వాడి, జూన్ 2 : బీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం రాజ్యమేలడంతో మొక్కలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అవి ఎండిపోయా యి. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ నీతూకిరణ్ నగరంలో పర్యటిస్తుండగా ఎండిపోయిన మొక్కలు కనిపించాయి.
దీంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 20కిలోమీటర్ల మేర డివైడర్ మధ్యలో మొక్కలు నాటామని, డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్థ కూడా కల్పించినట్టు చెప్పారు. వేసవికి ముందే తాను హెచ్చరించినా ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడచెవిన పెట్టి కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.