హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంత్రుల దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ నేతలు హస్తినకు దానం చేస్తున్నారని విమర్శించారు. రూ.2,500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టారని అన్నారు. ఈ ప్రభుత్వానికి అభివృద్ధిపై ధ్యాస లేదని, అవినీతిపైనే ఉన్నదని విరుచుకుపడ్డారు. ప్రజాపాలన పక్కకుపెట్టి అవినీతి పాలనను మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై విచారణ అంటూ కొంతసేపు, ఫోన్ ట్యాపింగ్ అంటూ కొంతసేపు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
జూపల్లిది రెండు నాల్కల ధోరణి
కేసీఆర్, హరీశ్రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను ఎర్రోళ్ల తీవ్రంగా ఖండించారు. ‘మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో ఉద్యమంలో పాల్గొన్నారన్న గౌరవం ఉండేది. కానీ, ఇప్పుడు ఆయన రెండు నాల్కల ధోరణి అర్థమవుతున్నది. విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశానన్న సంగతి ఆయన మర్చిపోయారు. ఐదేండ్లు మంత్రిగా పాలమూరుపై గుత్తాధిపత్యం చెలాయించారు.
నాడు మంత్రిగా కేసీఆర్ను ఎంత పొగిడారో గుర్తు చేసుకోవాలి. ఆ మాటలు వింటే జూపల్లి తన తలకాయను ఎక్కడ పెట్టుకుంటారు?’ అని మండిపడ్డారు. పాలమూరుకు కరువును కేసీఆర్ శాశ్వతంగా దూరం చేశారని, కేసీఆర్ పాలన కంటే ముందు, తర్వాత పాలమూరు జిల్లా ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకోవాలని హితవు చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుల కింద కేసీఆర్ హయంలో 6 లక్షలకుపైగా ఎకరాలకు నీళ్లిచ్చిన సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. పాలమూరుకు కేసీఆర్ నీళ్లిచ్చారా? 50 ఏండ్లలో, 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిందా? అన్న చర్చకు సిద్ధమా? అని జూపల్లికి సవాల్ విసిరారు.
రేవంత్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. రుణమాఫీ హామీపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందని, 100 రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆరోపించారు. హామీలు అమలుచేయని సీఎం రేవంత్, క్యాబినెట్పై చీటింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ను వెంటాడి, వేటాడుతామని హెచ్చరించారు. కేసీఆర్ సమస్యలు లేకుండా చేసినందువల్లే ప్రతిపక్షాలకు ధర్నా చేసే అవకాశం రాలేదని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజలను మోసం చేయాలని సీఎం రేవంత్ చూస్తున్నారని, ప్రజల పక్షాన పోరాడి కాంగ్రెస్ అంతు తేలుస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్తోనే కరువొచ్చింది: దేవీప్రసాద్
కాంగ్రెస్ రాగానే కరువు కూడా వచ్చిందని ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేవని తెలిపారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఒక్క హామీ నెరవేరలేదని, రైతుల హామీలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని విమర్శించారు. ‘రైతుబంధుపై మంత్రులు ప చ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రైతు రుణమాఫీ ఊసే లేదు. 3 ఎకరాల్లోపు రైతులకు ఇంకా రైతుబంధు అందలేదు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో భట్టి, రుణమాఫీపై జూపల్లి మాట్లాడిన తీరు ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా ఉన్నది’ అని వెల్లడించారు.
170 మండలాల్లో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారని, ఆ వాస్తవాలు చెప్పకుండా ప్రభు త్వం ఎదురుదాడి చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18,300 కోట్లు అప్పు తెచ్చిందని, ఈ అప్పు ఏం చేశారని ప్రశ్నించారు. పాలన మీద దృష్టి పెట్టకుండా హరీశ్రావుపై జూపల్లి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హరీశ్రావు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి మెప్పు కోసమే జూపల్లి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.