Dasoju Srravan | వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లపై ట్వీట్స్, సోషల్మీడియా, మీడియా కవరేజిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అర్థంపర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ఎలాంటి ప్రశంసలు తీసుకురావని అన్నారు. అంతర్జాతీయ ఫోరమ్లలోనైనా ఇలా చౌకబారు రాజకీయ వాచాలతను ఆపేస్తే మంచిదని హితవు పలికారు.
ప్రపంచ వేదికపై పెట్టుబడుల ఆకర్షణకు, ఆర్థిక విధానాలతో సమర్థత, రాష్ట్రాభివృద్ధిపై ముందుచూపు.. అంతర్జాతీయ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ప్రభావవంతమైన కమ్యూనికేషన్, భాగస్వాములను ప్రోత్సహించడానికి వ్యాపార అభివృద్ధి అవకాశాలను ప్రదర్శించాలని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ఇలాంటివేవీ ప్రతిబింబించడం లేదని అన్నారు. అపరిపక్వ దృక్పథాన్ని చూపుతున్నాయని విమర్శించారు.