ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆయా సభల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టం తెలిసిన నాయకుడని, అందుకే రైతులకు మేలు చేసే పథకాలను అమలుచేస్తున్నారని వివరించారు. రాష్ట్ర రైతాంగం మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా పథకాలు అమలుచేస్తున్నదని వివరించారు. మారుమూల ప్రాంతాల్లోనూ రహదారులు నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచిందని చెప్పారు. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
రైతుబంధు పథకాన్నే కేంద్రం కాపీ కొట్టి ‘పీఎం కిసాన్ సమ్మాన్’ పేరుతో అమలు చేస్తున్నదని మంత్రి హరీశ్రావు ఎద్ద్దేవా చేశారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్, మిషన్ కాకతీయ పథకాన్ని చూసి అమృత్ సరోవర్ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. మనుషులకు 108 అంబులెన్స్ లాగానే మూగజీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1062 సేవలు అందిస్తున్నదని, ఇలాంటి సేవలనే కేంద్రం కూడా ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర సర్కార్ జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేయగా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని పేర్కొన్నారు.
రైతుబీమా పథకంపై నోట్ ఇవ్వాలని ప్రధాని మన రాష్ట్ర అధికారులను కోరారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్ర పథకాలను చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమ గ్రామాలనూ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014కు ముందు అమలైన పథకాలను, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అమలవుతున్న పథకాలను పోల్చి చూడాలని కోరారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని, లేకపోతే తమ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పొరుగు రాష్ర్టాల ప్రజల నుంచి ఇదే డిమాండ్ వ్యక్తమవుతున్నదని తెలిపారు.
బీజేపీ నేతలు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ గల్లిలో విమర్శిస్తారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించని హామీలను సైతం అమలు చేస్తున్నారని కొనియాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూసి వారిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దామని వివరించారు. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, వైరాలోని ప్రభుత్వ దవాఖానలను వంద పడకల దవాఖానలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా రైతాంగం ఎస్సారెస్పీ, భక్తరామదాసు ఎత్తిపోతల, ఎన్నెస్పీ ద్వారా పంటలు సాగు చేసుకుంటూ సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. ప్రజలంతా కేసీఆర్కు మద్దతు పలకాలని కోరారు. రాబోయే రోజుల్లో సత్తుపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని అభయమిచ్చారు.
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ అత్యంత కీలకమైనదని, ఇది దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తెస్తుందని హరీశ్రావు ధీమా 9వ్యక్తంచేశారు. ప్రతి నాయకుడు తమ కార్యకర్తలతోపాటు సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను వెంటబెట్టుకుని వారు ప్రయాణిస్తున్న వాహనాల్లోనే సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ విజయవంతానికి దశ, దిశ చేస్తారని చెప్పారు. 2001లో కరీంనగర్ వేదికగా సింహగర్జన పేరుతో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉద్యమానికి ఊపిరిపోసిందని, ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి పోరాడారని, ఇక నుంచి దేశ ప్రజల కష్టాలకు పరిష్కారం చూపిస్తారని చెప్పారు. రైతుల కష్టం తెలిసిన నేతగా కేసీఆర్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు అందక రైతులు ఇబ్బందిపడ్డారని, నిరంతరం విద్యుత్తు కోతలు ఉండేవని, సాగు గిట్టుబాటు కాక వందలాది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. రైతు ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్, విద్యుత్తు ఉద్యమకారులను కాల్చి చంపిన టీడీపీ, సాగు పెట్టుబడులను రెట్టింపు చేసిన బీజేపీని ప్రజలు నమ్మరని అన్నారు. వ్యవసాయానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.10,500 కోట్లు వెచ్చిస్తున్నదని వెల్లడించారు. ఉచిత విద్యుత్తు పథకం సేద్యానికి ఊపిరిపోసిందని కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు హేళన చేశాయని, లేనిపోని ఆరోపణలు చేశాయని, కానీ ప్రాజెక్ట్ పూర్తయి ఇప్పుడు బీడు భూములను సస్యశ్యామలం చేసిందని వివరించారు. ఇప్పుడు తెలంగాణలో నాట్లు వేయాలంటే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి కూలీలు వస్తున్నారని చెప్పారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే రూ.30 వేల కోట్లు మంజూరు చేస్తామని కేంద్రం లేఖ పంపిందని, కానీ సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బంది కలిగించే విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారని గుర్తుచేశారు.
ఉపాధి హామీ పథకం నిధులతో రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పుబట్టిన కేంద్రం.. రాష్ట్రం నుంచి రూ.150 కోట్లు వాపస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని మండిపడ్డారు. సన్నాహక సభల్లో లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఖమ్మం బహిరంగ సభ ఇన్చార్జి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఉపేందర్రెడ్డి, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రితోపాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తదితరులు పూలతో అభిషేకం చేశారు.