Maoists | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): అడవి గుండెలో అభివృద్ధి గానం ప్రతిధ్వనించింది. నాడు ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాల ప్రజలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి ఫలాలను అందించింది. దీంతో గతంలో అడవి బిడ్డల అరణ్యరోదన చూసి వనవాసానికి పూనుకున్న అన్నలు కొండ కోనల్లో వికసిస్తున్న అభివృద్ధి ఫలాలను చూసి అరణ్యవాసాన్ని వీడారు. ఆయుధాలను త్యజించి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఫలితంగా తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా కనుమరుగైంది.
వామపక్ష తీవ్రదానికి గతంలో కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో నేడు అన్నల అలజడి పూర్తిగా తగ్గిపోయింది. స్వరాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాలు మొదలుకొని మారుమూల ఆదివాసీ గ్రామాల వరకు సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంతో మావోయిస్టులు కనుమరుగైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. తెలంగాణలోని మావోయిస్టు క్యాడరంతా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో మకాం వేయడంతో ఆ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం చేసింది. 2022లో వామపక్ష తీవ్రవాదానికి ఐదుగురు పోలీసు అధికారులు బలయ్యారు. వారిలో ఓ కానిస్టేబుల్, ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐ, గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారే. నిరుడు మావోయిస్టులు బాంబు దాడులు, మందుపాతరలు, ఎదురుకాల్పుల వల్ల 61 మంది తీవ్రంగా (25 మంది కానిస్టేబుళ్లు, 13 మంది హెడ్కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్ఐలు, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు సీఐలు, ముగ్గురు గెజిటెడ్ ఆఫీసర్లు, మరో ముగ్గురు ఇతర విభాగాల అధికారులు) ఉన్నారు. వీరిలో ఛత్తీస్గఢ్కు చెందినవారే అత్యధికంగా 55 మంది ఉన్నారని.. వీరితోపాటు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, బీహార్కు చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఒకరు గాయపడ్డారని ఎన్సీఆర్బీ తెలిపింది. నిరుడు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల వల్ల ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఇద్దరు పౌరులు మృతి చెందినట్టు వెల్లడించింది.
కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజల్లోకి
తెలంగాణలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కాగా ‘కమ్యూనిటీ పోలీసింగ్’ను అమలు చేసింది. ఆదివాసీ, గిరిజన గ్రామాల్లోని ప్రజలకు రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, టీవీ తదితర సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యావసతులను మెరుగుపర్చింది. ప్రభుత్వ సహకారంతో పోలీసులు అక్కడి యువతకు వర్క్షాపులు నిర్వహించి ఉపాధి చూపడంతోపాటు క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఆ 6 జిల్లాలకు కలిపి ఏటా రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేసిన ప్రభుత్వం.. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను చెక్కుల రూపంలో వారికే అందజేసే ఏర్పాట్లు చేసింది.
కొత్త రిక్రూట్మెంట్లు లేవు
బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో గిరిజన, ఆదివాసీ గ్రామాల ప్రజల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అన్యాయాన్ని ఎదిరించాలంటూ గతంలో బిడ్డలకు బందూకులిచ్చి ఉద్యమంలోకి సాగనంపిన తల్లిదండ్రులే నేడు ‘చదువుకొని బాగుపడు బిడ్డా’ అంటూ పుస్తకాలు చేతిలో పెట్టారు. గురుకులాలు, రోడ్లు అందుబాటులోకి రావడంతో అడవి బిడ్డలంతా చదువుబాట పడుతున్నారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్లు పూర్తిగా తగ్గిపోయాయి. వ్యక్తిగత కారణాలతో ఎవరైనా అన్నల వెంట వెళ్లినా ఎక్కువకాలం ఉండలేక వెంటనే ఇంటిబాట పడుతున్నారు. క్షణక్షణం భయంతో చనిపోవడం కంటే ధైర్యంగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించడం ద్వారా తమ వారికి సేవ చేయాలన్న ఆలోచనతో ఎక్కువ మంది వెనక్కి వస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు.