షాబాద్, ఫిబ్రవరి 14: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం పోరు తారస్థాయికి చేరింది. అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నది. బీఆర్ఎస్ తరఫున అజీజ్నగర్ నుంచి గెలిచిన 8వ వార్డు కౌన్సిలర్ శంకరయ్యను శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసినట్టుగా కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మొయినాబాద్లో కాంగ్రెస్ పది స్థానాలు గెలిచింది. స్వ తంత్రులు ఐదు స్థానాల్లో గెలువగా, ఇందులో ముగ్గురు కాంగ్రెస్ క్యాంపులో చేరారు. అయితే ఈ ముగ్గురితో పాటు బీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరిని తీసుకొస్తానని తనకు చైర్మన్గా అవకాశం ఇవ్వాలని ఓ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తున్నది. ఈ క్ర మంలోనే శంకరయ్యతో పాటు మరో కౌన్సిలర్ను తీసుకెళ్లినట్టుగా ప్రచారం జరుగుతున్నది.