Kyathanpalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని అధికారిక కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సీపీఐ మద్దతుతో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా, 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు.
ఇవాళ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్, సీపీఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నికకు హాజరయ్యారు. ఇక కోరం ఉండటంతో ఎన్నిక ప్రక్రియను సజావుగా కొనసాగించారు. దీంతో గొడిశెల సంధ్యారాణి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్గా గెలుపొందారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.