KCR | రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పదేండ్లలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? అని కేసీఆర్ నిలదీశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశంలో బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెండచం తప్ప, మతపిచ్చి లేపడం తప్ప, ఏదన్న మంచి పని జరిగిందా..? పెట్రోల్ ధర ఏంది.. డిజీల్ ధర ఏంది..? దేశంలో ఏం జరుగుతంది. మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా జైలుకు పోతావా..? అయితే మోడీ.. తప్పిడే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? ఇదేనా దేశాన్ని ముందకు తీసుకుపోయే పద్ధతి..? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి..? అంటూ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గుడ్డిగా ఓటు వేయొద్దు. చాలా ఇబ్బందులు వస్తాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా..? ఒక్క మాట ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలు తెలంగాణకు మంజూరు చేయాలని నేను 100 ఉత్తరాలు రాశాను. ఒక్క కాలేజీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలా మనకు 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. వీటి కోసం వంద యాభై ఉత్తరాలు రాశాను. స్వయంగా అడిగాను. కానీ ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? దేని కోసం ఓటు వేయాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
నా మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రానికి నిధులు బంద్ చేస్తా.. సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు గుంజుకుంటా.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు మోడీ. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టను అని చెప్పాను. నేను మీటర్లు పెట్టలేదు. ఆనాడు ఏడాదికి రూ. 5 వేల కోట్లు కోసిండు మోడీ. అలా రూ. 30 వేల కోట్ల నష్టం వచ్చింది. రైతాంగాన్ని కాపాడుకోవాలని, వారి బాధలు తెలుసు కాబట్టి, కరెంట్ అవసరం కాబట్టి వాళ్ల మీద భారం పడొద్దని మీటర్లు పెట్టలేదు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే మాకు ఓటేసిండ్రు మీటర్లు పెట్టండి అంటరు. మీటర్లు రావొద్దు అంటే ఓటు వేయొద్దు.. బీజేపీని నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరైన తెలివి ఉన్నట్టు.. రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు. దయచేసి ఆలోచించండి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్నాం. మీ బ్యాంకుల్లో డబ్బులు వేశాం. దళారీల బాధ లేకుండా మద్దతు ధర ఇచ్చాం. ధాన్యం ఎక్కువ పండింది కొనాలని ఢిల్లీలో ధర్నా చేశాం. నూకలు తినమని చెప్పినందుకు బీజేపీకి ఓట్లు వేయాల్నా..? మన ఏడు మండలాలు తీసుకుని ఆంధ్రాకు అప్పగించింది. ఏడాదికి 300 మెగావాట్ల కరెంట్ అందించే సీలేరు ప్రాజెక్టులను ఆంధ్రాకు అప్పగించింది. ఐటీఐఆర్ను రద్దు చేసింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాకర్టీ పెట్టలేదు. ఏ వర్గానికి న్యాయం జరగలేదు. మత్తులో, మతంలో పడి.. పిచ్చిలో పడి ఓట్లు వేస్తే మనం పిచ్చి లేసి పోతాం తప్ప మన అవసరాలు తీరవు. ఉద్యోగాలు రావు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. గుడ్డి కన్ను మూసిన ఒక్కటే తెరిచిన ఒక్కటే. బీజేపీ ఓటు వేసిన ఒక్కటే వేయకున్న ఒక్కటే అని కేసీఆర్ పేర్కొన్నారు.