రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటింది. గురువారం జరిగిన ఎన్నికల్లో 12 డైరెక్టర్ స్థానాల్లో 8 స్థానాలను గెలుచుకోగా, శుక్రవారం బ్యాంకు కార్యాలయంలో చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా చైర్మన్ స్థానానికి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్చైర్మన్ స్థానానికి అడ్డగట్ల మురళి నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థుల నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. సింగిల్ డిజిట్ నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. సహకార సంఘాలలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు గులాబీ పార్టీ అభ్యర్థులకే ఓటర్లు పట్టంకడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. సహకార రంగంలో దేశంలోనే ఖ్యాతి గడించిన సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థలో 2022 డిసెంబర్లో జరిగిన పాలకవర్గ ఎన్నికల్లోనూ 15 స్థానాలకు 15 బీఆర్ఎస్ గెలుచుకున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ ఎన్నికల్లోనూ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఓటర్లు పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం జరిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కేటీఆర్పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
విజయోత్సవ సంబురాలు
చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ విజయోత్సవ సంబురాలు జరిపింది. చైర్మన్, వైస్చైర్మన్తోపాటు డైరెక్టర్లను ఒకే వాహనంపై సిరిసిల్ల పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించింది. గెలిచిన అభ్యర్థులందరికీ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రాంమోహన్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల నారాయణ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.