నిర్మల్ : బీఆర్ఎస్ లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన యువత కేసీఆర్(CM KCR) నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ(BJP) , కాంగ్రెస్(Congress) నాయకులు, కార్యకర్తలు, యువకులు, మైనార్టీ వర్గానికి చెందిన నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran reddy) సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
నర్సాపూర్ మండల కేంద్రంతో పాటు రాంపూర్ గ్రామం, సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన సుమారు 300 మంది యువకులు, మైనార్టీకి వర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. నిర్మల్ అభివృద్ధి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికే సాధ్యమని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్(BRS) ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఎంతో అభివృద్ధి సాగిస్తున్నదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్(CM KCR) అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.గతంలో తెలంగాణ నుంచి వలసలు ఉండేవని, ఇవాళ రైతు సంక్షేమ పథకాలతో వలసలు ఆగి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇవాళ వేలాదిమంది బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు.
అభివృద్ది, సంక్షేమం, ప్రజల బాగు కోసం బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యువతను రెచ్చగొట్టి వారి భవిష్యత్తో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. పేపర్లీకేజీలకు పాల్పడి రాజకీయ పబ్బం గడుపుకోవడం మానుకుని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.