ఐనవోలు, మే 26: ‘ఎవరికేమైతే నాకేంటి.. నేను బా గుంటే చాలు’ అ నుకునే ఈ రోజు ల్లో.. అయిన వా రు, కన్నవారి పట్ల విపరీత బుద్ధులను ప్రదర్శించి.. బంధాలు, బంధుత్వాలను తెంచుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. ఓ మేన బావ మానవత్వం చాటాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన బావమరిది క్షేమం కోరి మోకాళ్లపై నడిచి వెళ్లి ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లించాడు. ఈ అపురూపమైన దృశ్యం ఆదివారం ఐనవోలులో ఆవిష్కృతమైంది.
హనుమకొండ జిల్లా కమలాపుర్ మండలం అంబాలకు చెందిన చింతకాయల నాగరాజు మేన బావమరిది గంధసిరి రజినీకాంత్ ఈ నెల 17న అరెపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయమై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. ఈ క్రమంలో తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లించుకుంటానని రజినీకాంత్ ప్రమాదానికి గురైన రోజే మొక్కుకున్నట్టు నాగరాజు వెల్లడించాడు.
మల్లికార్జునస్వామి ఆశీస్సులతో తన బావమరిది ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డాడని, ఈ మేరకు ఆదివారం ఉదయం అంబాల నుంచి ఐనవోలుకు మోకాళ్లపై నడుచుకుంటూ మల్లికార్జునస్వామి సన్నిధికి చేరుకుని మొక్కు చెల్లించినట్టు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించిన నాగరాజును ఈవో అద్దంకి నాగేశ్వర్, అర్చకులు స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించారు.
స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈవో మాట్లాడుతూ.. ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులు కోరిన కోర్కెలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడని తెలిపారు.