BRAOU | హైదరాబాద్, ఏప్రిల్ 24 : యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, క్రమబద్దీకరణ ప్రకియ చేపట్టేలోపు యూజీసీ పే స్కేల్ (బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3 శాతం ఇంక్రిమెంట్) ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలనే న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదో రోజు కొనసాగింది.
యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, హబీబుద్దీన్, వెంకట పిచ్చయ్య, చంద్రరెడ్డి, రామారావు, పాండు, తదితరులు పాల్గొని కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అంగీకరించాలని కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘము అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్, సలహాదారులు డా.కె నర్సింలు, డా. కాసం విజయ్, ఉపాధ్యక్షురాలు కె. ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డా. మఖ్ధూం మొహియుద్దీన్, డా. నాగిళ్ల రామకృష్ణ, కాంట్రాక్టు అధ్యాపకులు డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, డా.విజయ ఉషశ్రీ , డా. కురుమేటి దయాకర్, నర్సయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.