హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు శనివారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, 13న దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, 14న ఉదయం శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ముఖ్య కార్యక్రమాలు
ఈ నెల 11న ధ్వజారోహణ, 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు.