హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ తదితర పలు పరీక్షల్లో ఇప్పటివరకు అమ్మాయిలదే హవా. కానీ, లాసెట్ ఫలితాల్లో మాత్రం అబ్బాయిలు పైచేయి సాధించారు. ఈ పరీక్షకు హాజరైన అబ్బాయిల్లో 77.33%, అమ్మాయిల్లో 69.28%, ట్రాన్స్జెండర్లలో 66.67% మంది అర్హత సాధించారు. మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతోపాటు ఎల్ఎల్ఎంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేశారు.
మూడేండ్ల లాసెట్లో 74.76%, ఐదేండ్ల లాసెట్లో 68.57%, పీజీలాసెట్లో 91.10% చొప్పున మూడింటిలో కలిపి 74.90% మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. కాగా, డిగ్రీ ఫలితాలు, కోర్సులు, కాలేజీలకు సంబంధించి బార్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్రావు, ఉస్మానియా వైస్చాన్స్లర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాధారణంగా న్యాయ కోర్సుల్లో ఎక్కువగా ఆర్ట్స్ విద్యార్థులే చేరుతుంటారు. కానీ, ఈసారి లాసెట్ ఫలితాల్లో ఆర్ట్స్ విద్యార్థులతోపాటు సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం సత్తా చాటారు. మొత్తంగా బీకాం విద్యార్థులు 4,627 మంది, బీఎస్సీ విద్యార్థులు 3,714 మంది, బీఏ విద్యార్థులు 3,282 మంది, ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్) విద్యార్థులు 2,733 మంది అర్హత సాధించారు. మీడియం వారీగా చూస్తే.. తెలుగు మాధ్యమంలో 75.67%, ఆంగ్ల మాధ్యమంలో 74.75%, ఉర్దూ మాధ్యమంలో 36.13% మంది క్వాలిఫై అయ్యారు. లా కోర్సుల్లో తొలిసారి నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా సీట్లను 5 నుంచి 20 శాతానికి పెంచడంతో ఈసారి జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులకు గణనీయంగా సీట్లు దక్కనున్నాయి.