హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, బీజేపీకి కొమ్ముకాస్తున్న వీ6 చానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రజాస్వామంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా బీజేపీ జేబుసంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బీఆర్ఎస్పై, తెలంగాణపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మీడియా సమావేశాలకు వాటిని అనుమతించకూడదని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. దీనితోపాటు ఈ సంస్థలు నిర్వహించే చర్చలు సహా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులు పాల్గొనకూడదని నిర్ణయించింది. విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను గ్రహించాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.