లండన్: డ్యాషింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) .. టీమిండియా అరంగేట్రం ఎప్పుడు అవుతుందా అన్న టెన్షన్ నెలకొన్నది. అయితే దానికి తగినట్లు ఆ టీనేజ్ క్రికెటర్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ ఇంగ్లండ్తో రెండో టీ20 జరగనున్న నేపథ్యంలో.. వైభవ్ సూర్యవంశీ తన ఇన్స్టా స్టోరీలో న్యూ చాప్టర్ అన్న కామెంట్ పెట్టారు. కొత్త అధ్యాయం మొదలవ్వబోతున్నట్లు ఓ సంకేతాన్ని ఇచ్చాడతను. అయితే ఆ ఇన్స్టా స్టోరీ పోస్టుతో .. ఇంగ్లండ్తో జరిగే రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం చేస్తాడన్న ఊహాగానాలు బలపడ్డాయి. టీమిండియా జెర్సీలో సూర్యవంశీ దర్శనమిస్తాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ల జట్టులో వైభవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ మెసేజ్ ఉందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
వైభవ్ అరంగేట్రంపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ కీలక విషయాలు చెప్పారు. నెంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. లేదా వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను తప్పించి.. సూర్యవంశీని తొందరపడి తీసుకురాలేమని అన్నారు. శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో మోర్కెల్ మాట్లాడుతూ.. అభిషేక్, సంజూ టాప్ ప్లేయర్లు అని, ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడమే కోచింగ్ సిబ్బంది కర్తవ్యమని, మరో వైపు యువ క్రికెటర్ తలుపు తడుతున్నాడని, అది కూడా ఆసక్తికరమే అని, ఆ ఇద్దరే కాదు, యావత్ జట్టు సభ్యులకు మద్దతు ఇవ్వాలని అన్నాడు.