Diljit Dosanjh | చాలా కాలంగా సెన్సార్షిప్ వివాదాలు, ఆలస్యాల నడుమ నలిగిపోయిన బాలీవుడ్, పంజాబీ స్టార్ హీరో దిల్జీత్ దోసాంజ్ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. అయితే, థియేటర్ల విడుదల కోసం గతంలో ‘పంజాబ్ ’95’ (Punjab ’95) గా ప్రకటించిన ఈ సినిమా పేరును డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ‘సత్లుజ్’ (Satluj) గా మార్చారు. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1990ల కాలంలో పంజాబ్లో జరిగిన తీవ్రవాద అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలు, అదృశ్యాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సున్నితమైన కథాంశం కారణంగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాపై అనేక ఆంక్షలు విధించింది. దాదాపు డజన్ల కొద్దీ కట్స్ మరియు మార్పులు సూచించడంతో సినిమా విడుదల సంవత్సరాల తరబడి నిలిచిపోయింది.
అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో చిత్రబృందం థియేట్రికల్ విడుదలను పక్కనబెట్టి, నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ను పంజాబ్లోని ప్రసిద్ధ నది పేరు అయిన ‘సత్లుజ్’గా మార్చి డిజిటల్ ప్లాట్ఫారమ్లో స్ట్రీమింగ్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్ర పోషించారు.