హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు శనివారం ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు యువత ఆశలను నీరుగార్చేలా ఉన్నాయని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ నిర్ణయం దేశ భద్రతకు క్షేమకరం కాదని పేర్కొన్నారు. జై జవాన్-జై కిసాన్ అనే నినాదాన్ని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. ప్రభుత్వరంగ సంస్థలను చేసినట్టుగానే ఆర్మీని సైతం ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నదని ఆయన విమర్శించారు. అగ్నిపథ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని దేశంలోని యువతలో భరోసా కల్పించాలని లేఖలో వినోద్కుమార్ సూచించారు.