హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక విద్యామండలి కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి సీ24 పేరిట కరికులంను రూపొందించడంలో నిమగ్నమైంది. సీ24 సిలబస్, కరికులం రూపకల్పనకు పారిశ్రామికవేత్తలు, అధికారులతో కమిటీలు వేస్తారు. ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలు, ఇద్దరు సబ్జెక్టు లెక్చరర్లు, జేఎన్టీయూ ప్రొఫెసర్లు, పరిశ్రమ నిపుణులు ఈ కమిటీల్లో ఉంటారు. ఎమర్జింగ్ టెక్నాలజీ, పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా పాఠ్యాంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఈ కమిటీల నివేదిక ఆధారంగా పాలిటెక్నిక్ కోర్సుల సిలబస్ను అమలు చేస్తారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ ఏరియాలైన రోబోటిక్స్ ఈవీ వంటి కోర్సులపై దృష్టిపెట్టినట్టు అధికారులు తెలిపారు.
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల సిలబస్ను ప్రతీ మూడేండ్లకొకసారి మారుస్తున్నారు. గతంలో 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ను మార్చారు. దీనిని సీ -21గా పరిగణించారు. ఈ సిలబస్ మూడేండ్ల గడువు ఈ విద్యాసంవత్సరం ముగిసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా సీ -24 పేరుతో సిలబస్ రూపకల్పన ప్రక్రియను ప్రారంభించారు. అనేక సంస్కరణల ఫలితంగా పాలిటెక్నిక్ విద్యలో మార్పులొచ్చాయి. ఆన్స్క్రీన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ సిస్టం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆరు మాసాల ఇండస్ట్రియల్ ట్రైనింగ్, మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానాలను ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణలయ్యే వారి శాతం 39శాతానికి పైగా పెరిగింది. ఇదే సంస్కరణల్లో భాగంగా తాజాగా సిలబస్ను మార్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు.