ఈ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్
హైదరాబాదీ వరల్డ్ రికార్డు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అది 2000వ సంవత్సరం.. గాంధీ దవాఖానలో ఒక యూనిట్ రక్తం అందక వ్యక్తి మరణించాడని పత్రికలో కథనం వచ్చింది.. ఈ విషయం తెలుసుకొన్న ఓ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి దాకా నిర్విరామంగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకుడు డాక్టర్ సంపత్కుమార్ 21 ఏండ్లుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా 84 సార్లు రక్తాన్ని దానం చేశారు. 2006-07లో డెంగ్యూ దెబ్బకు ప్లేట్లెట్స్ పడిపోయి చాలామంది చనిపోయారని తెలుసుకొని 15 ఏండ్లుగా 183 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. గత ఏడాది అతనికి కరోనా సోకటంతో అప్పటి నుంచి 24 సార్లు ప్లాస్మా కూడా దానం చేశారు. అతనొక్కడే చేయటం కాదు.. మరొకరికి దానం చేయాలని చెప్పి 20వేల మందికి రక్తదానం చేయటంలో సహాయపడ్డారు. రక్తదానం, ప్లేట్లెట్స్, ప్లాస్మా దానం చేసి ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నారాయన. తన సహాయాన్ని ఇలానే కొనసాగిస్తానని సంపత్కుమార్ ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ప్రస్తుతం ఆయన సైబరాబాద్ పోలీసు, సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్కు వలంటీర్గా పని చేస్తున్నారు. ఆయనతో పాటు భార్య, కూతురు కూడా సంపత్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. రక్తదానం చేయటానికి అపోహలు, అనుమానం పెట్టుకోవద్దని డాక్టర్ సంపత్కుమార్ చెప్పారు. 18-65 ఏండ్ల వయస్కులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, అలా ఎంతోమందిని కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.