హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కరోనాతోపాటు బ్లాక్ఫంగస్ ప్రజలను హడలెత్తిస్తున్నది. కరోనా తగ్గినా ఫంగస్ సోకి ఎంతోమంది ప్రాణాలు కో ల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఐఐటీ శాస్త్రవేత్తలు రూ.200కే 60ఎంజీ ట్యాబెట్లను తయారుచేసే సాంకేతికతను రూపొందించారు. సాధారణంగా బ్లాక్ఫంగస్ చికిత్సలో రోగికి 60-100 యాంఫోటెరిసిన్ వయల్ ఇంజెక్షన్లు(50 మిల్లీ గ్రాములు) అవసరమవుతాయి. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.4వేలు. పైగా మార్కెట్లో కొరత తీవ్రంగా ఉన్నది. ఐఐటీహెచ్ శాస్త్రవేత్తల పరిశోధన ఉపయోగపడనున్నది. వాస్తవానికి యా టెరిసిన్ బీ ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలో తీసుకురావాలని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం శాస్త్రవేత్తలు రెండేండ్ల క్రితం నుంచే పరిశోధనలు సాగిస్తున్నారు. డాక్టర్ స్తపర్షి మజుందార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శర్మ ఇటీవలే టాబ్లెట్ను రూపొందించారు. క్రియేటివ్ అండ్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ బేస్డ్ ఆన్ నానో మెటీరియల్స్(కార్బన్) విధానంలో ట్యాబ్లెట్ల ను ఆవిష్కరించారు. దీన్ని పారిశ్రామికంగా ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ టాబ్లెట్స్ ఉ త్పత్తి, క్లినికల్ ట్రయల్స్, ఇతర ఆమోదాల కోసం దేశంలోని ఏ ఫార్మా కంపెనీ ముందుకు రాకపోవటం గమనార్హం.
పేదలకు స్వల్ప ధరలో ఔషధాలను అందించాలనే ధ్యేయంతో పరిశోధన సాగించాం. ఇప్పటికే పారిశ్రామిక స్థాయిలో యాంఫోటెరిసిన్ బీ ఔషధాన్ని ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశాం. ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. బ్లాక్ఫంగస్ వ్యాధి నివారణలో ఎదురవుతున్న ఔషధాల కొరతను వీటిద్వారా అధిగమించవచ్చు.
డాక్టర్ చంద్రశేఖర్శర్మ, కెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐటీహెచ్