చౌటుప్పల్, అక్టోబర్ 27: మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి, నిత్యం దళితులపై దాడులు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్న బీజేపీకి మాదిగల దెబ్బతో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని టీఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాప న్న, వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ క్రాస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మున్సిపాలిటీ కేంద్రంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కార్మిక, కర్షకులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అధోగతి పాల్జేస్తున్నదని మండిపడ్డారు. మాదిగల చిరకాల కోరికైన వర్గీకరణ అంశంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన బీజేపీ నేటికీ 8 ఏండ్లు గడుస్తున్నా వర్గీకరణను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక జనాభా అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుతున్న విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఎత్తివేయాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. డీజిల్, పెట్రోల్, వంటనూనె ధరలను సామాన్యుడికి అందకుండా చేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి మళ్లీ అధికారమిస్తే వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తామని, బీజేపీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళితబంధుతో ఆర్థిక భరోసా కల్పిస్తున్న టీఆర్ఎస్కు మాదిగలంతా సంపూర్ణ మద్దతు ఇచ్చి, ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.