హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లు ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్లోని మలక్పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘుబర్ దాస్ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేండ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1983లో తొలిసారి ఎమ్మెల్యేగా..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. 33 ఏండ్ల వయసులోనే 1983లో బీజేపీ తరఫున తొలిసారి మలక్పేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు.