Lok Sabha Elections | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): గొప్పగా చెప్పుకోడానికి సంక్షేమ పథకాలు, ఆర్భాటంగా చూపించడానికి అభివృద్ధి అంటూ ఏమీలేదు. ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్నది. మరేం చేయాలి? ఓటర్లను ఎలాగైనా మభ్యపెట్టాలి. అసత్య, అభూత కల్పనలతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఆలోచనాధోరణి ఇలాగే ఉన్నది. అందుకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సంప్రదాయ మీడియా, హ్యాకింగ్ తదితర మార్గాల్లో ఓటర్లను ఇప్పటికే ప్రభావితం చేస్తున్న కమలదండు.. తాజాగా యూట్యూబర్లకు వల వేసింది. ఇందుకోసం ఏకంగా కేంద్రమంత్రులే రంగంలోకి దిగారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
భేటీ కాగానే.. ఎంత మార్పు!
అత్యధిక వీక్షకులు ఉన్న టాప్ ఇండియన్ యూట్యూబ్ చానల్స్కు చెందిన 50 మంది నిర్వాహకులతో (యూట్యూబర్లతో) గత నెల 24న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. నాలుగు గంటలపాటు ముచ్చటించారు. లోపల ఏం జరిగిందో.. ఎవరికీ తెలియదు. అయితే, ‘జాతి నిర్మాణం’ కోసం సాయపడే కార్యక్రమాలు చేయాలంటూ సదరు యూట్యూబర్లకు మంత్రి ఉపదేశించినట్టు మాత్రం కథనాలు వెలువడ్డాయి. అయితే, అప్పటివరకూ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేయని ఈ యూట్యూబ్ చానల్స్.. ఉన్నట్టుండి బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాలను చేయడం ప్రారంభించాయి. ఆర్థికం, సామాజికం, ఆరోగ్యం, విద్య, స్ఫూర్తిదాయకం, భక్తి ఇలా.. విభిన్న రంగాల్లో నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహించే ఆ చానల్స్.. ఒక్కసారిగా బీజేపీ జపాన్ని ఎత్తుకొన్నాయి. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో ఇంటర్వ్యూలు నిర్వహించే రణ్వీర్ అల్లాహ్బాదియా కేంద్ర మంత్రులను ఇంటర్వ్యూ చేయడం.. ఆ కార్యక్రమాలకు ప్రభుత్వమే కో-స్పాన్సర్గా ఉండటం కొసమెరుపు. ‘జాతి నిర్మాణం’ కోసం కాకుండా ‘బీజేపీ నిర్మాణం’ కోసం పనిచేయాలంటూ గోయల్ యూట్యూబర్లను కోరటం మార్పునకు కారణమని తెలిసింది.
సబ్స్ర్కైబర్ల సంఖ్యను బట్టి చెల్లింపులు
భేటీకి ఆహ్వానించిన యూట్యూబ్ చానల్స్ సబ్స్ర్కైబర్ల సంఖ్య దాదాపు ఐదు లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఉన్నట్టు అదే సమావేశంలో పాల్గొన్న ఓ యూట్యూబర్ చెప్పారు. యూట్యూబ్ గణాంకాలను బట్టి.. పది మంది సబ్స్ర్కైబర్లు ఉన్న చానల్లో పోస్ట్ అయ్యే ఒక్కో వీడియోను.. ట్యాగ్స్, షేర్లను బట్టి సగటున 110 మంది వరకు చూస్తున్నారు. ఈ లెక్కన 3 కోట్ల మంది సబ్స్ర్కైబర్లు ఉన్న చానల్లో పోస్ట్ అయ్యే వీడియోను 33 కోట్ల మంది చూస్తారు. సరిగ్గా బీజేపీకి ఇదే కావాలి. అసత్య, అభూత కల్పనలతో కూడిన వీడియోలను ఈ చానల్స్ ద్వారా ప్రసారం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టాలని కమలదళం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్తో పోలిస్తే వాట్సాప్ యూజర్లు ఎక్కువ. దేశంలో దాదాపు 49 కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు.
తొలుత అసత్య వార్తలను వాట్సాప్ వేదికగా కమలదళం ఇబ్బడిముబ్బడిగా ప్రచారం చేసింది. దీంతో ‘వాట్సాప్ యూనివర్సిటీ వండిన వార్తలు ఫేక్’ అనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇది గ్రహించిన కమలదళం రూటు మార్చింది. 46.7 కోట్లతో వాట్సాప్కు సమానమైన యూజర్, వ్యూవర్ బేస్ ఉన్న యూట్యూబ్ను బీజేపీ ఇప్పుడు లక్ష్యంగా చేసుకొన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వీడియోలను పోస్ట్ చేసే యూట్యూబర్కు.. సబ్స్ర్కైబర్కు రూ. 5 చొప్పున కమలదళం చెల్లిస్తున్నట్టు భేటీలో పాల్గొన్న ఓ యూట్యూబర్ తెలిపారు. 3 కోట్ల మంది సబ్స్ర్కైబర్లు ఉన్న చానల్కు బీజేపీ కట్టబెట్టే మొత్తం రూ. 15 కోట్ల వరకు ఉంటున్నట్టు లెక్క.