Telangana | తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలతో దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పంచన్యాయాలు తీసుకొచ్చింది ప్రజలను వంచించేందుకే అని పేర్కొన్నారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సభ విఫలమయ్యిందని అన్నారు.
రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మీ స్కీం కింద ఇస్తామన్న రూ.2500కే దిక్కులేదు.. ఇప్పుడు రూ. లక్ష ఇస్తామని మరో మోసానికి కాంగ్రెస్ తెరలేపిందని బీజేపీ ఎంపీ లక్ష్మన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయమని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ పేరు చెప్పి మొసలి కన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ పాలన,అవినీతి పాలనకు కాంగ్రెస్ గ్యారింటీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు బద్ధ వ్యతిరేకమని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.