Alleti Maheshwar Reddy | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం తరుగు పేరిట మాఫియా రైతులను పీల్చుకుతింటున్నదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాలు, తేమ పేరుతో బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. కాంటా చేసిన ధాన్యానికి రసీదు ఇవ్వకపోగా, మిల్లులకు తరలించిన ధాన్యానికీ రైస్ మిల్లర్లు 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల్లో పోసి 45 రోజులుగా ఎదురుచూస్తున్నా.. ప్రoభుత్వం కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల వద్ద రైతులు కాపలా కాస్తూ అనేక అవస్థలు పడుతున్నారని, అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొందరు రైతులు పిడుగుపాటుతో మరణించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం ధాన్యానికే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలు చెప్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను పరిషరించే వరకు, కాంగ్రెస్ తన హామీలను నెరవేర్చేదాకా బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.