ఆదిలాబాద్ రూరల్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ కౌన్సిలర్ నెమలికొండ కరుణ తన అనుచరులతో కలిసి శనివారం హైదరాబాద్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతోపాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి దయాకర్, నాయకులు ప్రసన్నకుమార్, లక్ష్మణ్సింగ్, గోవర్ధన్, సాయికిరణ్రెడ్డి, విశాల్రెడ్డి, పురుషోత్తం తదితరులు పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరినట్టు కరుణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
జగిత్యాల, సాగర్లోనూ భారీగా చేరికలు
జగిత్యాల రూరల్/హాలియా: ఆయా జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన యూత్ నాయకు లు కొడిపెల్లి సురేశ్, ఏఎంసీ డైరెక్టర్ రాజేశ్ ఆధ్వర్యం లో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 30మంది టీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు, తిరుమలగిరి (సాగర్) మండలాల్లోని బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 30 కుటుంబాలు హాలియా పట్టణంలో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.